ద్వితీయోపదేశకాండము గ్రంథ విశ్లేషణ | BOOK OF DEUTERONOMY INTRODUCTION | THE BIBLE | TELUGU BIBLE

 

ద్వితీయోపదేశకాండము


                                120 సంవత్సరాల వృద్ధుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణమును ముగించాడు. వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనడానికి సిద్ధముగా ఉన్న రెండవ తరము వారైన ఇశ్రాయేలీయులను పంపడానికి అతడు ఇచ్చిన సందేశమే ద్వితీయోపదేశకాండము. లేవీయకాండమువలె ఈ పుస్తకములో పెద్ద ఆజ్ఞల పట్టికను చూడవచ్చును. కాని లేవీయకాండములో ముఖ్యముగా యాజక వంశముతో మాట్లాడినట్లుగా ఇక్కడ సాధారణ ప్రజలతో మాట్లాడుచున్నాడు. వారిముందు తరమువారి భయంకర నాశనమునుండి పాఠము నేర్చుకొనునట్లును, లోబడుటలో ఉన్న గొప్పతనమును అర్ధము చేసుకొనునట్లును మోషే పిలుపునిచ్చుచున్నాడు. ఈ పుస్తకములో ఆజ్ఞల యొక్క బంధకాలను చూడకుండ దేవుని వాక్యములోని మాధుర్యాన్ని దర్శించుచున్నాము అనునదే ఈ పుస్తకము యొక్క ప్రాముఖ్యతగా ఉన్నది. లోబడుట ద్వారా వచ్చు ఆశీర్వాదమును లోబడక పోవుట ద్వారా వచ్చు శాపమును వివరించుటకే ఈ పుస్తకము వ్రాయబడినది.

ద్వితీయోపదేశకాండము - క్రీస్తు: ప్రభువు (క్రీస్తు) తరచుగా ఈ పుస్తకములోని లేఖన భాగములను ఉపయోగించేవాడు. సాతానుతో పోరాడుటకు ప్రభువు ఉపయోగించిన మూడు వచనములు ద్వితీయోపదేశ కాండము నుండి తీసుకొనబడినవే. (మత్తయి 4:-10). పరిత్యాగ పత్రికను గురించి యూదులతో మాట్లాడేటప్పుడు, ధర్మశాస్త్రములోని ప్రధానమైన ఆగ్నేమిటి అని ప్రశ్న వేసినప్పుడు ప్రభువు ఎత్తిచూపినవి ఈ పుస్తకములోని వచనములే (మత్తయి 19:3-8మత్తయి 22:30-40)

పుస్తకము యొక్క పేరు: హెబ్రీ భాషలో ఈ పుస్తకము హార్టేబరీమే అనే మాటతో ప్రారంభమగుచున్నది. “ఆ వాక్యములు" అని అర్ధమునిచ్చే, ఆ మాటే పుస్తకము యొక్క పేరుగా ఇయ్యబడినది. మోషే యొక్క ఆ మాటలే దేవుడిచ్చిన ధర్మశాస్త్ర వాక్యములే అని ఈ మాట చూపించుచున్నది. సీనాయి పర్వతమునందు ఇవ్వబడిన ధర్మశాస్త్రమును తిరిగి చెప్పే పుస్తకము అను సందర్భములో ద్వితీయోపదేశకాండము అనే పేరు తెలుగులో ఇవ్వబడుట బహుసరిగా నున్నది.

సమకాలీన పరిస్థితులు: యెరికోకు, యొర్దాను నదికి తూర్పున వున్న మోయాబు మైదానములో జరిగిన సంగతులు ఈ పుస్తకములో చూపించ బడుచున్నవి. ఈ సంగతులన్ని సుమారు రెండు నెలలలో జరిగినవని అనుకొనవచ్చును. దీనిలో రెండవ నెల మోషే గురించి ఇశ్రాయేలీయులు ప్రలాపించిన దినములుగా ఉన్నవి దానిని విడదీస్తే అరణ్య ప్రయాణము చివరి ఒక నెలలో (క్రీ.పూ 1405) దీనిలో చెప్పబడిన ముఖ్యమైన సంగతులు జరుగుచున్నవి. ద్వితీయోపదేశకాండము 1:3; ద్వితీయోపదేశకాండము 34:8; యెహోషువ 5: 6-12, ఈ వాక్యభాగములను పోల్చి చూస్తే ఇది తేటపడుతుంది. క్రొత్త తరము కనానులో ప్రవేశించుటకు సిద్ధమగుచున్న సమయములో, వారు దేవుని విశ్వసించి, లోబడి దైవీక ఆశీర్వాదములను స్వతంత్రించుకొనవలెననే లక్ష్యంతో వ్రాయబడిన పరిశుద్ద పుస్తకముగా దీనిని ఎంచవచ్చును.

ఉద్దేశము: దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు చేసినవి మరలా వారికి జ్ఞాపకము చేయుట, వారిని మరలా ఒక అర్పణకు ప్రోత్సాహించుట.

గ్రంథకర్త: మోషే (మోషేమరణము తరువాత మిగిలిన భాగమును యెహోషువ వ్రాసినట్లుగా చెప్పబడుచున్నది)

ఎవరికి వ్రాసిరి: వాగ్దానదేశములో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్న నూతన ఇశ్రాయేలు సంతతికి

కాలము: క్రీ.పూ 1405

గత చరిత్ర: యోర్దానునది తూర్పు ప్రాంతము

ముఖ్యవచనము: ద్వితీయోపదేశకాండము 7:9

ముఖ్యమైన వ్యక్తులు: మోషే, యెహోషువ

ముఖ్యమైన స్థలాలు: మోయాబు దేశములోని అరాబా మైదానము.

గ్రంధ విభజన: ముందు సీనాయిపర్వతము మీద దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రమును పోలిన మాదిరిగా మోషే ఇచ్చిన మూడు సందేశములే ఈ పుస్తకములోని ముఖ్యాంశములు

  1. మొదటి సందేశములో Deut,1,1-4,43 వరకు దేవుడు తన ప్రజల కొరకు చేసిన కార్యములు. 2.రెండవదిగా Deut,4,44-26,19 వరకు దేవుడు వారి దగ్గర నుండి ఎదురుచూచిన కార్యములు. 3.మూడవదిగా ద్వితీయ 27వ అధ్యాయము నుండి 33వ అధ్యాయము వరకు భవిష్యత్తులో దేవుడు వారి కొరకు చేయ నిశ్చయించినవి మోషే చెప్పుచున్నాడు. ఈ విధముగా మోషే దేవుని ధర్మశాస్త్రమును ఎత్తి చూపి, వివరించి, స్థిరపరచుచున్నాడు.

కొన్ని క్లుప్తమైన వివరములు: పరిశుద్ధ గ్రంథములోని ఐదవ పుస్తకము, అధ్యాయములు 34; వచనములు 958; ప్రశ్నలు 33; చరిత్రకు సంబంధించిన వచనములు 690; నెరవేరిన ప్రవచనములు 230; నెరవేరనివి 37; దేవుని సందేశములు 33; ఆజ్ఞలు 519; వాగ్దానములు 47; హెచ్చరికలు 497.

No comments:

Post a Comment

Total Pageviews

Flipkart

Get in Touch

Feel free to drop us a line to contact us
Your Name





Your Message*